by సూర్య | Wed, Nov 24, 2021, 12:46 PM
మోగ: పంజాబ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ముమ్మరం చేస్తోంది. ఓటర్లను ఆకట్టు కొనేందుకు అనేక హామీలు ప్రకటిస్తోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్ వచ్చిన ఢిల్లీ సీఎం,ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మోగలో పర్యటించారు. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే ఒక్కో మహిళకు నెలకు ₹1000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు ₹1000 చొప్పున జమచేస్తామన్నారు. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న మహిళలకు వాటిని కొనసాగించడంతో పాటు అదనంగా వారి ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామన్నారు.
ఆప్ ‘మిషన్ పంజాబ్’లో భాగంగా కేజ్రీవాల్ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మోగలో ఓ సభలో మాట్లాడారు. పంజాబ్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈసారి పాగా వేసే దిశగా ప్రచారానికి పదును పెడుతోంది. కేజ్రీవాల్ ఇప్పటికే పంజాబ్ ప్రజలకు పలు హామీలు కురిపించారు. తమ పార్టీని గెలిపిస్తే ప్రతి ఇంటికీ ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ ఇవ్వడంతో పాటు నిరంతరాయంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే,ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఔషధాలను పంపిణీ చేస్తామన్నారు.
Latest News