by సూర్య | Tue, Nov 23, 2021, 11:34 AM
కాపవరం గ్రామంలో 100% కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యం మోడల్ ట్రయిల్ రన్ . నూరుశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసే దిశలో కాపవరం గ్రామంలో ట్రయిల్ రన్ నిర్వహించడం జరిగిందని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.సోమవారం కాపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల, వ్యాక్సిన్ వేసుకున్న వారి జాబితా తో రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, కాపవరం గ్రామంలో 100 శాతం వ్యాక్సిన్ అందచేసే ప్రక్రియ లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి కి సందర్శించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే నూరుశాతం లక్ష్యాలను చేరినట్లు నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా, వ్యాక్సిన్ వేసుకున్న రికార్డుల ను పరిశీలించగా , గ్రామ పరిధిలో సుమారు 300 మంది ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవలసిన వారు ఉన్నట్లు గుర్తించమన్నారు. సామాజిక బాధ్యతగా 18 సంవత్సరాలు నిండిన వారు వ్యాక్సినేషన్కు సహకరించాలని మల్లిబాబు కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
కరోనాను కట్టడి చేసేందుకు 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, అందులో భాగమే ఓటర్ల జాబితా తో సరిచూడడం అని ఎస్. మల్లిబాబు అన్నారు. ఇటువంటి స్పెషల్ డ్రైవ్ల ద్వారా వొచ్చే ఫలితాలు ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు చర్యలు చేపట్టామన్నారు.ఈ పర్యటనలో ఆర్డీవో వెంట కొవ్వూరు తహసీల్దార్ బి.నాగరాజు నాయక్, గ్రామ సచివాలయ, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
Latest News