by సూర్య | Tue, Nov 23, 2021, 11:18 AM
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ ఛార్జీల(టారిఫ్)ను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రవేశ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం వరకు పెంచనున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ.200-300కు చేర్చాలని ఎయిర్టెల్ భావిస్తోంది! అప్పుడే మూలధనంపై సహేతుకమైన రాబడి ఉంటుందని.. ఇది ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారితీస్తుందని వివరించింది.
ఏఆర్పీయూ ఆదాయం పెరగడం వల్ల నెట్వర్క్లు, స్పెక్ట్రం కొనుగోళ్లలో గణనీయ పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే భారత్లో 5జీ అమలుకు కూడా ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టారిఫ్ చార్జీలను 'తిరిగి సమతుల్యం' చేయాలని నిర్ణయించినట్లు వివరించింది. ఈ పెంపుతో ఇప్పటి వరకు రూ.79తో వచ్చిన 28 రోజుల కాలపరిమితిగల ప్రామాణిక వాయిస్ ప్లాన్కు ఇకపై రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.
Latest News