by సూర్య | Fri, Nov 19, 2021, 12:07 PM
పోలీసు పెట్రోలింగ్ వాహనంలో తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కానిస్టేబుల్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.5 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులో తెలంగాణ, ఆంధ్రా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో కొందరు బడా వ్యాపారులు చెక్ పోస్టులను ఎగ్గొట్టి తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. కొందరు పోలీసు పెట్రోలింగ్ కానిస్టేబుళ్లను రంగంలోకి దించి ఆ వాహనం ద్వారానే ఏపీకి మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ నెల 14న నార్కట్ పల్లి సరిహద్దులో మద్యంతో పోలీసు వాహనం తిరుగుతూ కనిపించింది. చెక్ పోస్టు పోలీసు వాహనం కావడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోలేదు. ఏపీలోని దాచేపల్లి మండలం రామాపురం క్రాస్రోడ్డు వద్ద పోలీసు వాహనం నుంచి మరో వాహనానికి మద్యం తరలిస్తుండగా స్థానిక పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ తో పాటు వాహనంలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Latest News