by సూర్య | Tue, Oct 26, 2021, 11:10 AM
అరణియార్ ప్రాజెక్టు నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో ఆ జలాలు తమిళనాట ప్రవహించే కాలువ పరిసర ప్రాంతాల్లోని 72 గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ అల్పీజాన్ వర్గీస్ సోమవారం ఓ ఉత్తర్వు వెలువరించారు. అరణియార్ జలాశయం నాలుగు క్రష్గేట్ల నుంచి సెకనుకు 400 ఘనపుటడుగుల చొప్పున అదనపు జలాలను విడుదల చేస్తుండటంతో అరణియార్ ప్రవాహ కాలువ పరిసర గ్రామాల్లో వరద పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆరణియార్ జలాశయం నుంచి విడుదలవుతున్న జలాలు సురుటుపల్లి చెక్డ్యామ్ నుంచి వెలువడి ఊత్తుకోట, పెరియపాళయం, ఆరణి, కవరపేట, ఎలియంబేడు, పొన్నేరి, పెరుంబేడు, ఆండార్మఠం మీదుగా పళవేర్కాడు వద్ద సముద్రంలో కలుస్తాయి. ఈ జలాలు ఉదృతంగా ప్రవహించడం వల్ల తారాచ్చి, కీళ్సిట్రపాక్కం, మేల్సిట్రపాక్కం, పేరండూర్, పనపాక్కం, పాలవాక్కం, లచ్చివాక్కం, చూళైమేని, కాక్కవాక్కం, పోందవాక్కం, అనంతేరి, మాంబాక్కం, కలపట్టు, మాళత్తూరు, ఆత్తుపాక్కం, నెలవాయ్ పాలవాక్కం, ఆర్ఎన్ కండిగ, పుదువాయల్, పొన్నేరి, కుమార సిరులపాక్కం, మనోపురం, కవరపేట, పెరువాయల్, రెడ్డిపాళయం, కాట్టూరు, కట్టపాక్కం తదితరగ్రామాల్లో వరదలు సంభవించే అవకాశం వుందని, ఆ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, ప్రజాపనుల శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ ప్రాంతాల వద్ద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
Latest News