by సూర్య | Tue, Oct 26, 2021, 10:27 AM
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమిపాలవ్వడంతో పలువురు నెటిజన్లు పేసర్ మహ్మద్ షమిని కించపరుస్తున్నారు. పరుషపదజాలంతో ఆన్లైన్లో కామెంట్లు చేస్తూ తీవ్రంగా దూషిస్తున్నారు. అయితే, ఈ చర్యలను చాలా మంది అభిమానులు, క్రికెటర్లు ఖండిస్తున్నారు. షమికి అండగా నిలుస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ లాంటివారు స్పందించారు. అలాగే రాజకీయ నేతల్లోనూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం వాటిని ఖండించారు. షమి అంకితభావమున్న బౌలర్ అని, పలు మ్యాచ్ల్లో టీమ్ఇండియాను గెలిపించాడని కొనియాడుతున్నారు.
మరోవైపు షమిని దూషించేవారికి దీటుగా అతడికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ పాకిస్థాన్ అభిమాని మాటలకు అతడెలా స్పందించాడనేదే ఈ వీడియో ఉద్దేశం. అప్పుడు కూడా టీమ్ఇండియా పాక్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సెంగ్ రూమ్కు వెళుతుంటే గ్యాలరీలోని ఓ పాక్ అభిమాని జట్టు మొత్తాన్ని ఓ పరుషపదంతో దూషించడం ప్రారంభించాడు. టీమ్ఇండియా ఆటగాళ్లంతా మౌనంగా వెళ్లిపోయినా ఆ మాటలు విన్న షమి స్పందించాడు. పాక్ అభిమాని వద్దకెళ్లి సీరియస్ వార్నింగ్ ఇవ్వబోయాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ధోనీ అతడిని లోపలికి తీసుకెళ్లాడు. దేశం పట్ల అతడికి ఉన్న అంకితభావం ఇలాంటిదని టీమ్ఇండియా పేసర్కు అండగా నిలుస్తున్నారు.
Latest News