by సూర్య | Sun, Oct 24, 2021, 11:18 AM
అరకొర జీతాలు పొందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరుతో జీతాల్లో కోత విధించనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల నుంచే బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయడంతో నవంబరులో దీపావళి పండుగ ముందు అందుకునే జీతాలు సంతోషం కాకుండా విషాదం మిగల్చనున్నాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఫీల్డ్ సిబ్బందికి సైతం బయోమెట్రిక్ అమలు చేస్తుండటంతో అక్టోబరు జీతాల్లో కోత పడుతున్నట్టు తెలిసిందని వాపోతున్నారు. తమతో సెలవు దినాల్లో సైతం పనిచేయిస్తున్నారని, సరిగా పనిచేయని బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటుచేసి, వాటి ఆధారంగా జీతాల్లో కోత విధిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చాలా సచివాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయడం లేదని, వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఫీల్డ్ సిబ్బంది కూడా సచివాలయానికి వచ్చి సకాలంలో హాజరు వేసుకోవాలనడం విచిత్రంగా ఉందంటున్నారు. 90 శాతం ఉద్యోగులకు అక్టోబరు జీతాల్లో కోత పడనున్నట్టు తెలియడంతో ఉద్యోగులు ఆందోళనతో వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. ఆన్డ్యూటీ, క్యాజువల్ లీవ్స్, పబ్లిక్ హాలిడేస్ కూడా పట్టించుకోకుండా జీతాలు కట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇది జగనన్న మెగా జీతం తగ్గింపు పథకం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు వచ్చే ఎక్కువ జీతాల వల్ల దీపావళికి టపాసులు ఎక్కువ పేల్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తారనే నవంబరు 4న వచ్చే జీతాల్లో కోత వేస్తున్నారంటూ సెటైర్లు వేసుకోవడం కనిపించింది. పట్టణాల్లో వార్డు సచివాలయం కార్యాలయం ఒక చోట ఉంటే, ఆ ఏరియా మరో చోట ఉంటోందని, దీంతో ఆ ప్రాంతంలో లేరంటూ బయోమెట్రిక్ యంత్రాలు ఉద్యోగుల వేలిముద్రలు స్వీకరించడం లేదని చెబుతున్నారు.
ఆయా ప్రాంతాల పరిధిలోనే సచివాలయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామీణులకు వైద్యసేవలు అందించే ఏఎన్ఎంలకూ జీతాల్లో కోత విధించడం అన్యాయమంటున్నారు. ఆదివారాలు, సెలవుదినాల్లోనూ ప్రత్యేక డ్రైవ్లంటూ ఎప్పుడంటే అప్పుడు సేవలందిస్తున్న వారికి బయోమెట్రిక్లో హాజరు లేదంటూ జీతాలు కోయడంలో న్యాయముందా? అని ప్రశ్నిస్తున్నారు.
Latest News