by సూర్య | Sat, Oct 23, 2021, 02:55 PM
ఉల్లిపాయలతో కలిగే ప్రయోజనాలుఅత్యధికం. ఆరోగ్యానికి ఉల్లిపాయలు చాలా మంచివి. ఉల్లిలోని ఔషధగుణాలు మంచి ఆరోగ్యాన్నిస్తాయి. ఉల్లితో ప్రయోజనాలు ఎక్కువ కాబట్టే..ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటూ అనాదిగా సామెత ఉంది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఉల్లిపాయల కారణంగా జనం బంబేలెత్తిపోతున్నారు. ఉల్లిపాయలు తినడం వల్ల వింతవ్యాధి సోకి తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. అమెరికాలోని 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు ఉల్లిపాయల కారణంగా సాల్మొనెల్లా వ్యాధి సోకింది. మెక్సికో లోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే ఈ వ్యాధికి కారణమని తెలిసింది. దాంతో ప్యాకింగ్, స్టిక్కర్ లేని ఉల్లిపాయల్ని పారవేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్హె చ్చరించింది. ఆ పచ్చి ఉల్లిపాయలు తిన్న వెంటనే అనారోగ్యం పాలైనట్టు 75 శాతం బాధితులు తెలిపారు.సీడీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ 129 మంది ఆసుపత్రి పాలయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరూ మరణించలేదు. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యకాలంలో అత్యధికంగా సాల్మొనెల్లా కేసులునమోదయ్యాయి. టెక్సాస్, ఓక్లహోమా ప్రావిన్స్లో ముందుగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. సాల్మొనెల్లా అనేది ఓ సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. పేగులపై ప్రభావం చూపించి..జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలకు దారి తీస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. మల విసర్జన ద్వారా బయటకు పోతుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి 4-7 రోజులపాటు బాధిస్తుంది. కొన్నిరకాల బ్యాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్లు లేదా నాడీ వ్యవస్థలో ఇన్ఫెక్షన్కుకారణమౌతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.