by సూర్య | Sun, Jun 13, 2021, 10:25 AM
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మూడు రోజులుగా సీఎం జగన్కు లేఖలు రాస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇవాళ కూడా లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల హామీ నెరవేరలేదని.. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ హామీతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని ఎంపీ లేఖలో కోరారు.
గ్రామ సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రఘురామ లేఖలో పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. 18వేల ఉపాధ్యాయ, ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్మెంట్కు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ చేయకుండా వదిలేశారని.. వందల సంఖ్యలో సెక్రటేరియల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. కోర్టులో కేసుల కారణంగా అంతంత మాత్రమే భర్తీ అయ్యాయని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. అత్యవసరంగా పరిగణించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
Latest News