by సూర్య | Sat, Jun 12, 2021, 03:34 PM
అమరావతి: కొవిడ్పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వద్దకు వెళ్లడం లేదని.. ఇదే సమయంలో కరోనా బారిన పడినవారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అందిస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈసందర్భంగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు సెల్యూట్ చేశారు.
శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నో విపత్తులను చూశానని.. కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్టు, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సేవ చేయడానికి ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, అవకాశాలు ఉంటాయని.. మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవ తమ అజెండా అని స్పష్టం చేశారు. కరోనా విపత్తులోనూ టెలిమెడిసిన్ ద్వారా సాయం చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.
రియల్ హీరో సోనూసూద్ : చంద్రబాబు
వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో చంద్రబాబు వర్చువల్గా మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సోనూసూద్ సేవలను కొనియాడారు. రియల్ హీరోగా ఆపత్కాలంలో అందరికీ అండగా నిలుస్తున్నారన్నారు. ఆపత్కాలంలో సాయమడిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని చెప్పారు. సోనూసూద్ చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని చంద్రబాబు కోరారు.
Latest News