by సూర్య | Tue, Jun 08, 2021, 02:46 PM
జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరువ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశానని, వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని అన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సిఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని, సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు.
Latest News