by సూర్య | Fri, Jun 04, 2021, 12:11 PM
విత్తనాలు సమకూర్చడం నుంచి పంటలు చేతికంది, మార్కెటింగ్ చేసుకునే వరకూ అన్నదాతలకు అన్నివేళలా అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామకృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అన్నదాతలకు ఖరీఫ్ రాయితీ వరి విత్తనాల పంపిణీని జిల్లాలో పోలాకి మండలం మబుగం నుంచి శుక్రవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ లాంఛనంగా ప్రారంభించారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా జిల్లాలో నేటి నుంచి 13 రకాల పరి విత్తనాల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉ ద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలోనే రైతులకు సంక్షేమం సిద్ధిస్తుందని ఇప్పటికే రుజువైందని అన్నారు. రైతులకు మేలుచేయాలన్న సత్సంకల్పంతో పనిచేస్తున్న సీఎం జగన్ అని అన్నారు. రైతులకు సాగునీటి అవసరాలు పూర్తిగా తీర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నదుల అనుసంధానంతోపాటు, ఇతర అనేక సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లాకు సంబధించినవన్నీ త్వరితగతిన ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. వ్యవసాయదారులు వ్యవసాయాన్ని ఒక పండుగలా ఆనందంతో నిర్వహించు కోవడం అన్నది జగన్ పాలనలోనే సాధ్యమయిందని అన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎనలేని ప్రాధాన్యతని ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. ప్రతీరైతుకు చేరువుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఇదంతా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సుసాధ్యమవుతోందని తెలిపారు. ప్రతిపంటకీ మద్దతు ధర కల్పించి రైతులు నష్టపోకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హతగల ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందించడమే ప్రభుత్వ సంకల్పమని, అర్హత ఉండి ఇంతవరకూ సంక్షేమ పథకాలు పొందలేనివారు ఎవరూ లేరన్నారు.
జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున రాయితీపై పంపిణీ చేస్తారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై విత్తనం పంపిణీ చేయనున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కే.శ్రీధర్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కరిమి రాజేశ్వర రావు, ఏ డీ కే. రవీంద్ర భారతి, ఏవో వెంకట్రావు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Latest News