by సూర్య | Fri, Jun 04, 2021, 09:58 AM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు ఇస్తున్న మందు పేరును 'ఔషధచక్ర'గా నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆయుర్వేద మందు పంపిణీకి అవసరమైన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్లో మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం నిమగ్నమై ఉంది. సేకరణ పూర్తయిన తర్వాత రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభమవుతుందని ఆనందయ్య సన్నిహితులు వెల్లడించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదటి ప్రాధాన్యతగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి 'పి' రకం మందు (కరోనా రానివారు వాడేది) అందచేయాలని నిర్ణయించారు. తర్వాత కరోనా రోగులకు అవసరమైన 'పి, ఎల్, ఎఫ్' రకాల మందు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని సంకల్పించారు. మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు.
Latest News