by సూర్య | Thu, Jun 03, 2021, 12:10 PM
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం తన క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
''175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నాం. వచ్చే ఏడాది జూన్ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తాం. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. PMAYతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని'' సీఎం జగన్ పేర్కొన్నారు. 7 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు
Latest News