by సూర్య | Sat, May 29, 2021, 10:41 AM
కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తయింది. అయితే మందుకి సంబంధించిన నివేదికను ఇవాళ తయారు చేసే అవకాశముంది. అన్ని రిపోర్టుల్ని కూలంకుశంగా పరిశీలన చేస్తామన్నారు ఆయుష్ కమిషనర్ రాములు. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లలో ఎలాంటి ఇబ్బంది లేదని.. మందు విషయంలో సీఎం కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారాయన. ఎట్టకేలకు కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరుకున్నాడు ఆనందయ్య. అలాగే మందు పంపిణీ పై క్లారిటీ ఇచ్చారు. మందు పంపిణీ జరగడం లేదని.. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక పంపిణీ ఉంటుందన్నారు.
అయితే కరోనా నివారణ అంటూ నాటు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్టు సమాచారం. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారినీ అనుమతించడంలేదు
Latest News