by సూర్య | Thu, May 27, 2021, 10:45 AM
పురపాలక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలన్న అధికారుల నిర్ణయం తగదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీటికి బదులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్సీఈఆర్టీ టీవీ చానెల్ ద్వారా బోధన చేస్తే సత్ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. మున్సిపల్ స్కూళ్లల్లో చదివే వారిలో అత్యధికులు నిరుపేదలని, వారి గృహాల్లో సాధారణంగా ఒక్క గదే ఉండి, కుటుంబ సభ్యులందరూ అందులోనే సర్దుకుంటూ ఉంటారని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఆన్లైన్ తరగతులను ఏకాగ్రతతో వినడం అసాధ్యమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు గనుక పురపాలక పాఠశాలల్లో చదువుతుంటే ఏకకాలంలో వారు ఆన్లైన్ తరగతులను ఎలా వినగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. పైగా.. గతేడాది నిర్వహించిన ఆన్లైన్ తరగతుల వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులకు కూడా ఎస్సీఈఆర్టీ టీవీ చానెల్ ద్వారా బోధన నిర్వహిస్తే మేలని పలువురు విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
Latest News