by సూర్య | Wed, May 26, 2021, 02:18 PM
ఆనందయ్య మందుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ అభిప్రాయం. అయితే ఐసీఎంఆర్ ఏం నివేదిక ఇస్తుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఆనందయ్య మందు ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందుకు కేంద్రం ఇలా అనుమతి ఇచ్చిన వెంటనే అలా యుద్ధ ప్రాతిపదికన మందును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని అన్నారు. ఆనందయ్య శిష్యబృందంతో చెవిరెడ్డి భేటీ అయ్యారు. ఆయుష్ నుంచి అనుమతి వస్తే మందు తయారీని ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల ఫార్మసీలో ఔషధ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రం నుంచి అనుమతి లభిస్తేనే ఈ మందును పంపిణీ చేస్తామన్నారు. ఆనందయ్య తయారు చేసిన మందు ఖచ్చితంగా పనిచేస్తుందని నివేదిక అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎన్ని లక్షల మందికైనా మందును పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
Latest News