by సూర్య | Mon, Apr 12, 2021, 10:21 AM
చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే వైద్యులు గది ఉష్ణోగ్రతతో సమానమైన నీళ్లు (నార్మల్ వాటర్) తాగడం మంచిదని చెబుతారు. రోజూ ఎంత నీరుతో అంత ఆరోగ్యమని సూచిస్తున్నారు. మహిళలు రోజుకు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగడం మంచిదని చెబుతున్నారు. నీరు తాగమన్నారు కదా అని చల్లని నీటిని తాగేందుకు మాత్రం ప్రయత్నించొద్దు. వీలైతే గోరు వెచ్చని నీటిని తాగండి. ముఖ్యంగా ఉదయం వేళల్లో దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. వేడి నీళ్లు తాగమన్నారు కదా అని బాగా మరిగిన నీళ్లు తాగడం మొదలుపెడితే.. కొత్త సమస్యలు వచ్చి పడతాయి. ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి. నీటిని గడగడా తాగేయకుండా.. నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. రోజూ ఇలా చేస్తే.. తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారు. మరి, రోజూ వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే: కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు, ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది మంచి ఔషదం. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడేది వేడి నీళ్లే. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను సైతం వేడి నీళ్లతో అధిగమించవచ్చు. వేడి నీరు గొంతు సమస్యలను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారికి కూడా వేడి నీరు మంచి మందు. వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషదం. ఈ కరోనా సీజన్లో వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మరింత మంచిది. వైరస్లు ప్రమాదకర బ్యాక్టరీయాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది.
Latest News