by సూర్య | Fri, Apr 09, 2021, 12:45 PM
ఇవాళ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. జలసౌధ నుంచి ఇరు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. వేసవి నీటి అవసరాలతో పాటు గడిచిన మూడు నెలల్లో నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి 14 టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. కరోనా కారణంగా జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు వెబినార్లో పాల్గొంటారు. శ్రీశైలంలో 810 అడుగుల లెవల్ నుంచి నీటిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్లో ఏ లెవల్ వరకు నీటిని తీసుకోవాలి, మే నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు ఎంత మేర నీళ్ల అవసరం ఉంటుందనే అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలు మార్చి నెలాఖరు వరకు ఉపయోగించుకున్న నీటి లెక్కలపైనా చర్చజరగనుంది.
2019, 2020ల్లో వచ్చిన వరద నీటితోనే నెట్టుకొచ్చిన శ్రీశైలం జలాశయం.... ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తుంది. రిజర్వాయర్ లో కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, ప్రస్తుతం 812 అడుగులు మాత్రమే నీరుంది. దీంతో జలాశయం వెలవెలబోతోంది. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోగా, జలాశయం నుంచి నీరు వెళ్లే ఎత్తిపోతల పథకాలకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకుంది.రెండు రాష్ట్రాల పరిధిలోని జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి మట్టం, వాటిని వాడుకున్న తీరుపై అవసరమైన మొత్తం సమాచారాన్ని తమకు అందించాలని కోరింది కృష్ణా బోర్డు. ఈ ఏడాది కృష్ణా, గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి. కృష్ణా బేసిన్ లో ఏకంగా వెయ్యి 280 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 35.73 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
Latest News