by సూర్య | Tue, Apr 06, 2021, 02:37 PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7,8 తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లకు 7న, పోలింగ్ నిమిత్తం 8న సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు. ఆ రెండు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు.
దుకాణాలు, వాణిజ్య సంస్థలు కూడా సెలవు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48గంటలు ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. కాగా, ఈ నెల 1న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
10న ఫలితాలు వెల్లడిస్తారు. ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే ఈనెల 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన చోటు నుంచే ప్రక్రియ కొనసాగనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఇప్పటికే టీడీపీ బహిష్కరించగా, ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని బీజేపీ కోర్టు మెట్లు ఎక్కింది. అటు జనసేన ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. ఏపీలో పరిషత్ ఎన్నికలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని విన్నవించింది. జనసేన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలిచ్చింది. అయితే ఎస్ఈసీ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చాక అందులో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదించడం గమనార్హం. ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
Latest News