by సూర్య | Sat, Apr 03, 2021, 12:12 PM
ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీఈవోలతో సీఎక్స్వో సదస్సు నిర్వహించారు. కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఐటీ సంస్థల సలహాలు, సూచనలు తెలుసుకోవడం కోసం కంపెనీ సీఈవోలతో.. మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
అమెజాన్, ఫేస్బుక్, సామ్సంగ్, గూగుల్ క్లౌడ్, ఫ్లాక్స్కాన్, హెచ్టీసీ, ఫుజి, మోర్గాన్ స్టాన్లీ తదితర కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగంలో విద్యాకానుక పథకం సహా అనేక పథకాలు సీఎం తెచ్చారన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయ అభివృద్ధి, నాణ్యమైన మానవ వనరుల తయారీకి కృషి చేస్తున్నామన్నారు. కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చాయని అలాంటి సమయంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. జగనన్న తోడుతో చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు సహకరించామని మంత్రి తెలిపారు.
ప్రతి పథకాన్నినేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఐటీ మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రెండు వేల ఎకరాలలో 3 కాన్సెప్ట్ సిటీలను నిర్మించ బోతున్నామని వెల్లడించారు.
ఫైబర్ నెట్ ద్వారా ప్రతి గ్రామానికి 2024 నాటికి ఇంటర్నెట్ అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి గౌతమ్రెడ్డి వెల్లడించారు.
Latest News