by సూర్య | Wed, Mar 31, 2021, 12:54 PM
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటు హక్కును సాధించుకునేందుకు న్యాయపోరాటం చేస్తానని అన్నారు. ఎస్ఈసీ కి ఉన్న అధికారాలను వినియోగించుకున్నానని, వేరే వారి పరిధిలోకి వెళ్లలేదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ పట్ల నాకు అవగాహన ఉందని, వీలున్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేశానని, బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలపై నిబంధనలకు లోబడి చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఎస్ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని, ఎన్నికల సంస్కరణలపై నివేదిక రూపొందించి గవర్నరుకు పంపానని అన్నారు. తన తర్వాత ఎస్ఈసీగా రాబోతున్న నీలం సాహ్నీతో ఎస్ఈసీ విధులు, బాధ్యతలపై చర్చించానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎస్ఈసీ స్వతంత్రత, నిబద్దత కలిగి ఉండాలని, బయట వ్యక్తులు ఎస్ఈసీని ప్రభావితం చేసే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ప్రభుత్వం నుంచి కోరుకున్న విధంగా పూర్తి సహకారం లభించిందని అన్నారు.
పదవీ విరమణకు ముందు గవర్నర్ ను కలవాలనుకున్నానని, ఆయన వాక్సినేషన్ వేసుకుంటున్నందున అప్పాయింట్మెంట్ దక్కలేదని, ఎన్నికల నిర్వహణ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం నుంచి.. సీఎస్ నుంచి పూర్తి సహకారం లభించింది కాబట్టే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలిగామన్నారు.
Latest News