by సూర్య | Sat, Mar 27, 2021, 01:14 PM
భర్త వేధింపులు తట్టుకోలేక న్యూగుంటూరు రైల్వేస్టేషన్ వద్ద శక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించిన ఒంగోలులోని గద్దలకొండకు చెందిన మోటుపల్లి రమాదేవి(24)ని వెస్టు డీఎస్పీ కె.సుప్రజ కాపాడారు. పొదిలిలోని పోస్టల్ విభాగంలో పని చేస్తున్న ముసలయ్యతో రమాదేవికి 2015లో వివాహం జరిగింది. అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు కాగా ఆ విషయం దాచాడు. ఈ క్రమంలో పెళ్లి అయినప్పటి నుంచి భర్త డబ్బు కోసం రమాదేవిని హింసించేవాడు. రెండున్నరేళ్ల కుమారుడిని కూడా తల్లి నుంచి దూరం చేసి ఒంగోలులోని శిశు విహార్లో చేర్పించాడు.
ఒంగోలులో మున్సిపాల్టిలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేసే రమాదేవి కుమారుడిని తనకు ఇప్పించాలని భర్తను కోరుతున్నా ఆయన పట్టించుకోకుండా డబ్బుల కోసం ఆమెనే వేధిస్తున్నాడు. దీంతో ఆమె గతంలో పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది. ఈ నేపథ్యంలో గుంటూరు చేరుకుని అర్ధరాత్రి సమయంలో చెయ్యి కోసుకుని రైలు పట్టాలపై పడుకుంది. సమాచారం అందుకున్న వెస్టు డీఎస్పీ సుప్రజ ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి కొత్తపేట పోలీసులకు అప్పగించారు. శుక్రవారం ఆమెను రైల్వే పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు అప్పగించారు
Latest News