by సూర్య | Thu, Mar 25, 2021, 04:09 PM
మెగాస్టార్ చిరు ఏపీ సీఎం జగన్ కు మరోసారి ట్వీట్ చేసారు. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ అనంతరం, రాష్ట్రంలో సినిమా షూటింగులను నిర్వహించడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన సమయంలో ఆయనను కలిసి కృతజ్ఙతలు తెలుపుకొన్న చిరంజీవి.. మరోసారి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. కర్నూలు శివార్లలోని ఓర్వకల్లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' పేరు పెట్టడాన్ని చిరంజీవి స్వాగతించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టినందుకు వైఎస్ జగన్కు కృతజ్ఙతలు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.. చరిత్ర గుర్తించని ఓ పోరాట యోధుడని, ఓ గొప్ప దేశభక్తుడని మెగాస్టార్ చెప్పారు. అలాంటి సమర యోధుడి పేరు కర్నూలు విమానాశ్రయానికి పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలాంటి మహా యోధుడి పాత్రను తాను తెర మీద పోషించానని చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రను పోషించడం తనకు మాత్రమే దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి.. కర్నూలు ఎయిర్పోర్ట్కు పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ట్వీట్ చేసారు.
Latest News