by సూర్య | Thu, Mar 25, 2021, 02:41 PM
అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు దళిత సంఘాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా భారీగా దళితులు కేతిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిని దళిత సంఘాలు ముట్టడిస్తున్నాయని ముందే తెలియడంతో కేతి రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కేతిరెడ్డి ఇంటికి వెళ్తోన్న ఆందోళనకారులను ముందస్తుగానే అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కలెక్టర్ గంధం చంద్రుడు ఓ పండగ నిర్వహణపై ఆంక్షలు విధించడంతో కేతిరెడ్డి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను లెక్కచేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత సంఘాల ఎంట్రీలో వివాదం మరో మలుపు తీసుకుంది. కాటమయ్య ఉత్సవ వివాదం పక్కకు వెళ్లి.. కొత్త సమస్య తెరపైకి వచ్చింది. తమ సామాజికవర్గానికి చెందిన కలెక్టర్ను దూషించారని దళిత వర్గాలు రోడ్డెక్కాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా మరికొందరు దళితులు ఎంట్రీ ఇవ్వడంతో పరస్పరం ఆరోపణలు హోరెత్తుతున్నాయి. దీంతో ఈ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందో ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. ఇద్దరికీ ప్రజల్లో మంచి పేరే ఉండడంతో ఎవరిది తప్పు అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్పై ముఖ్యమంత్రి కార్యాయలం కొంత సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సున్నితమైన ఇలాంటి అంశాలను టచ్ చేయొద్దని ఎమ్మెల్యే కేతిరెడ్డికి, కలెక్టర్ చంద్రుడికి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. వారిద్దిరి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా.. ఇతర వర్గాలు మాత్రం ఈ వివాదాన్ని వదిలేలా కనిపించడం లేదు.
Latest News