by సూర్య | Wed, Jan 20, 2021, 05:23 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి కీలక ఘట్టం పూర్తైంది. అయితే డోర్ డెలివరీ ప్రక్రియను రేపటి నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన బియ్యాన్ని కార్డుదారుని ఇంటి వద్దే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సంవత్సరానికి రూ. 830 కోట్లు అదనంగా వెచ్చించి ఈ పధకం రూపొందించారు.
అయితే ఈనెల 21న విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 డోర్ డెలివరీ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్ధలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్న బియ్యంలో నూకల శాతం, రంగుమారిన శాతం అధికంగా ఉండడం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండడం వల్ల ఎక్కువశాతం మంది వినియోగించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగే మెరుగపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి కార్డుదారుల ఇంటి వద్దనే ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖశ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ వేయబడి ఉంటుంది. ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. అన్ని మొబైల్ వాహనాలకూ జిపిఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్టైంలో తెలుసుకోవచ్చు.
అంతేకాదు మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా ఖశ్చితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. బియ్యం, నిత్యావసర సరుకులు కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రూ. 539 కోట్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.