by సూర్య | Wed, Jan 20, 2021, 01:21 PM
ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్లు ఫోన్పే, గూగుల్ పే యూపిఐ మార్కెట్లో తమ సత్తా చాటుతున్నాయి. భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన ఈ యాప్లు యూపిఐ మార్కెట్లో అధిపత్యం చలాయిస్తున్నాయి. క్షణాల్లో నగదు బదిలీ అవకాశం ఉండటం, క్యాష్ రివార్డులు ఇస్తుండటంతో ఈ యాప్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా కారణంగా ప్రజలు నగదుకు బదులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్పే యాప్ల ద్వారా ఒక్క డిసెంబర్ నెలలోనే రూ .1.82 లక్షల కోట్ల విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గూగుల్పే ద్వారా రూ .1.76 లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. అంటే యూపిఐ లావాదేవీల్లో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న గూగుల్పేను ఢీకొట్టి ఫోన్పే అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పవచ్చు.
ఈ రెండు యాప్లు యుపిఐ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. డిసెంబరులో జరిగిన మొత్తం యుపిఐ లావాదేవీల సంఖ్యలో 78 శాతం (నవంబర్లో 82 శాతం), లావాదేవీల విలువలో 86 శాతం (నవంబర్ మాదిరిగానే) ఫోన్పే, గూగుల్ పే ద్వారానే జరిగాయని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక స్పష్టం చేసింది. కాగా, అక్టోబర్, నవంబర్లలో జరిగి యుపిఐ ట్రాన్సాక్షన్స్ను పరిశీలిస్తే గూగుల్ పే అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్లో గూగుల్ పే వరుసగా 857.81 మిలియన్ల లావాదేవిలు నిర్వహించగా, నవంబర్లో 960.02 మిలియన్ లావాదేవీలను నిర్వహించింది. డిసెంబరులో లావాదేవీల వాల్యూమ్లో 11 శాతం క్షీణించి నెలవారీ రెండవ స్థానానికి పడిపోయింది. కాగా, ఫోన్పే ద్వారా అక్టోబర్లో 839.88 మిలియన్లు, నవంబర్లో 868.4 మిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది. 31,291.83 కోట్ల రూపాయల విలువైన 256.36 మిలియన్ లావాదేవీలతో పేటీఎం మూడో స్థానంలో నిలువగా, కొత్తగా డిజిటల్ పేమెంట్ రంగంలోకి ప్రవేశించిన వాట్సాప్ రూ .29.72 కోట్ల విలువైన 810,000 లావాదేవీలను నిర్వహించింది.