by సూర్య | Tue, Jan 19, 2021, 03:49 PM
ఏపీలో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని కంకణాపల్లిలో అంతుచిక్కని వ్యాధితో 6 నెలల వ్యవధిలో 50 ఏళ్లలోపు వారు 10 మంది మృతి చెందారు. రెండు రోజుల క్రితం కంకణాపల్లికి చెందిన గెమ్మెల రామకృష్ణ అనే యువకుడు వింత లక్షణాలతో మృతి చెందాడు. దీంతో వింత వ్యాధి విషయం బయటకు వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కంకణాపల్లిలో మొత్తం 300 మంది వరకు నివసిస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 9 మంది మృతి చెందారు. తొలుత జ్వరం రావడం, కొన్ని రోజుల తర్వాత శరీరమంతా ఉబ్బి రక్తహీనతతో నడవలేక మంచాన పడుతున్నారు. ఆ తర్వాత కళ్లు పచ్చగా మారి లేవలేని స్థితిలో మంచం పడుతున్నారు. నెలరోజుల్లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ అంతుచిక్కని వ్యాధిపై డాక్టర్లు స్పందించారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని పాచిపెంట పీహెచ్ సీ డాక్టర్లు తెలిపారు. ఐతే ఈ గిరిజనులకు సోకుతున్న వ్యాధికి అసలు కారణమేంటనేది తేలడం లేదని చెప్పారు. జ్వరం, శరీరం ఉబ్బిపోవడం, కళ్లు పచ్చగా మారడమనే లక్షణాలు అంతు చిక్కని విధంగా ఉన్నాయంటున్నారు. ఐతే కొన్నిసార్లు కామెర్ల వ్యాధి ముదిరితే ఇలాంటి లక్షణాలుండే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.