by సూర్య | Mon, Jan 18, 2021, 11:52 AM
ఏపీలో విగ్రహాల ధ్వంసాన్ని ఆధారాలతో సహా డీజీపీ గౌతమ్ సవాంగ్ బయటపెట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలపై డీజీపీ చెప్పినవన్నీ వాస్తవాలేనని చెప్పారు.టీడీపీ, బిజెపి నేతలు డీజీపీని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. భాజపాకు భయపడేందుకు తమది తెదేపా ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భాజపా నేతలు అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో లబ్ధి కోసమే భాజపా ప్రయత్నిస్తోందని వెల్లంపల్లి విమర్శించారు. సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెదేపా పాలనలో గుళ్లు కూల్చినపుడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ఏమయ్యారని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే అర్చకుల వేతనాలు పెంచుతామని మంత్రి తెలిపారు.
Latest News