by సూర్య | Mon, Jan 18, 2021, 11:32 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రూ. 10 రూపాయల చొప్పున నాలుగు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్దంచేస్తోంది. తొలుత కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గ్రామ ఉజాలా పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఎల్ఈడీ బల్బులను అందజేయనుంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఐదు జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చోటుదక్కించుకుంది.
కృష్ణా జిల్లాతో పాటుగా వారణాసి (ఉత్తరప్రదేశ్), వాద్నగర్ (గుజరాత్), నాగపూర్ (మహారాష్ట్ర), ఆరా (బీహార్) జిల్లాలను తొలి విడతలో కేంద్ర ఇంధన శాఖ ఎంపిక చేసింది. ఈ పథకానికి అవసరమైన రూ. 450 కోట్లను సమకూర్చనుంది. అయితే కృష్ణా జిల్లాలో ఫిబ్రవరి నెల నుంచి బల్బుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం 8.84 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయనున్నారు. గతంలో 9 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందించగా.. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందిస్తారు.