by సూర్య | Sun, Jan 17, 2021, 03:51 PM
గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో హల్ చల్ చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. పలుమార్లు చికిత్స కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆమె వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది.
గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేసింది. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు.