by సూర్య | Fri, Jan 15, 2021, 05:15 PM
గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అని అన్నారు. ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్కు లేదని... అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారని మండిపడ్డారు.
ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానానికి వైసీపీ స్వస్తి పలకాలన్నారు. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వానికి సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని దుయ్యబట్టారు. నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్టానికి అవసరమా.. అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.