by సూర్య | Tue, Jan 12, 2021, 02:38 PM
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి నెలకొంది. పల్లెల్లో గంగిరెద్దులు, హరిదాసుల పాటలు, రంగవల్లులు, పిండి వంటల సందడి నెలకొంది. మరోవైపు కోడి పందేల కోసం పందేల రాయుళ్లు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బరులు రెడీ అవుతున్నాయి. ఐతే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పందెం బరులను పోలీసులు, రెవెన్యూ అదికారులు ధ్వంసం చేస్తున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 500 బరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీసులు 250 బరులను గుర్తించి ధ్వంసం చేశారు. 190 కేసులను నమోదు చేసి 574 మందిని బైండోవర్ చేశారు. వేల సంఖ్యలో కోడి కత్తులను సీజ్ చేశారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో 144, సెక్షన్ 30 అమలులో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎక్కడైనా కోడి పందాలు, గుండాట, జూదం, పేకాట, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలతోపాటు పేకాట, గుండాటలకు చాలా ప్రాంతాలు వేదికవుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఇప్పటికే గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేసినా.. పందేలు, జూదం నిర్వహణకు ఏర్పాట్లు మాత్రం చాపకింద నీరులా సాగిపోతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే జిల్లాలో రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు జూదం రూపంలో చేతులు మారుతుంటుంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తారు. వైరి వర్గాలు సైతం సంప్రదాయం పేరుతో ఒక్కటైపోతాయి. కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, అమలాపురం ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో రాజుపాలెం, మార్కెట్ ప్రాంతం, అయినాపురం, కొత్తలంక, పల్లిపాలెం, క్రాపచింతలపూడి గ్రామాల్లో కోడిపందేల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఐ.పోలవరం మండలంలో కేశనకుర్రు, ఎదుర్లంకల్లోనూ కోడిపందేలు నిర్వహణకు నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కాట్రేనికోన మండలంలో చెయ్యేరు, గెద్దనపల్లిలో పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. తాళ్లరేవు మండలంలో పిల్లంక, గోవలంక ప్రాంతాల్లో పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బరులను వేలం ద్వారా రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు.
Latest News