by సూర్య | Tue, Jan 12, 2021, 10:38 AM
సీరం ఇన్సిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈరోజు రాష్ట్రానికి రానుంది. 4.7 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకోనున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కట్టుదిట్ట భధ్రతతో గన్నవరంలోని రాష్ట్ర శీతలకరణ కేంద్రానికి అధికారులు తరలించనున్నారు. 19 వాహనాలలో రేపు అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకి వ్యాక్సిన్ను తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగే విధంగా వ్యాక్సిన్ డెలివరీ వాహనాలలో ఏర్పాట్లు చేశారు. గన్నవరం రాష్ట్రస్థాయి శీతలకరణ కేంద్రంలో రెండు పెద్ద వాక్ ఇన్ కూలర్స్...ఒకటి 40 క్యూబిక్ మీటర్లు...మరొకటి 20 క్యూబిక్ మీటర్ల కెపాసిటీని ఉంచారు. అలాగే వ్యాక్సిన్ భధ్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించారు. గన్నవరంలోని రాష్ట్రస్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రంలో ప్రత్యేక భధ్రతా ఏర్పాట్లు చేశారు. బయట వ్యక్తులకి నో ఎంట్రీ విధించారు. ఎనిమిది సీసీ కెమారాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఈ నెల 16 న వ్యాక్సినేషన్ ప్రక్రియకి శరవేగంగా ఏర్పాట్లు చేశారు. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు.
Latest News