by సూర్య | Mon, Jan 11, 2021, 01:51 PM
విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. తన కోరిక తీర్చాలంటూ విద్యార్థి తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనతో పడుకోకపోతే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలను విక్రయిస్తుంటుంది.
అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ మహిళపై కన్నేశాడు. శనివారం సాయంత్రం తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళను ఆ ఉపాధ్యాయుడు వెంబండించాడు. ఆమె ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చకపోతే తాను చదువు చెప్పే స్కూల్లోనే చదువుతున్న ఆమె పిల్లల భవిష్యత్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. ఆమెపై దాడికి దిగాడు. అడ్డువచ్చిన మహిళ తల్లిదండ్రులపైనా దారికి దిగాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో అక్కడ నుంచి నెమ్మదిగా ఉడాయించాడు.
ఈ ఘటనపై మహిళ కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానికులు ఆందోళన చేపట్టారు. మహిళతో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చేస్తూ ఆదివారం బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.