by సూర్య | Sat, Jan 09, 2021, 02:40 PM
రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఘోరంగా ఫెయిలయ్యారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో బటన్లు నొక్కితేనో, పత్రికల్లో రంగరంగుల ప్రకటనలు ఇస్తేనే రైతులను ఉధ్ధరించినట్లు కాదని జగన్ గ్రహించాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, రైతు భరోసా, సున్నావడ్డీ పథకాల్లో రైతులకు ఒరిగింది శూన్యమని మండిపడ్డారు. 39 లక్షల ఎకరాల వరకు రైతులు నష్టపోతే, ప్రభుత్వం 12లక్షల ఎకరాల వరకే నష్టాన్ని పరిమితం చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ధాన్యం రైతులకు వైసీపీ ప్రభుత్వం రూ.2,726కోట్లకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించకుంటే వారికి పండగ సంతోషం ఎక్కడినుంచి వస్తుందో జగన్మోహన్రెడ్డి, వ్యవసాయశాఖా మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సంక్రాంతి లోగా ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై టీడీపీ పోరాడుతుందని నిమ్మల రామానాయుడు తెలిపారు.
Latest News