by సూర్య | Sat, Jan 09, 2021, 12:48 PM
ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో..తల్లిదండ్రులను ఎదిరించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆనందంగా సాగాల్సిన వారి జీవితం విధి ఆడిన వింత నాటకంతో అర్ధాంతరంగా ముగిసింది. నెలన్నర క్రితం భర్త గుండెపోటుతో మృతిచెందితే..తీవ్ర మనోవేదనకు గురైన భార్య గురువారం తనువు చాలించింది. ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం నెల్లూరులోని జెడ్పీకాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) నగరంలోని జీజీహెచ్లో కాంట్రాక్ట్ పద్ధతిపై స్టాఫ్నర్స్గా పనిచేస్తూ పొదలకూరురోడ్డు జెడ్పీ కాలనీలో నివాసం ఉంటోంది.
ఆమెకు గూడూరు అయ్యవారిపాళేనికి చెందిన జగదీష్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. గతేడాది అక్టోబర్ 29న పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే డిసెంబర్లో జగదీష్ గుండెపోటుతో మృతిచెందాడు. భర్త హఠాన్మరణం చెందడం, కుటుంబసభ్యులు దూరంగా ఉండడంతో శిరీష తీవ్రమనోవేదనకు గురైంది. ఈనెల 6న శిరీష తనకు తోడుగా స్నేహితురాలు రమాదేవిని ఇంట్లోకి తెచ్చుకుంది. అయితే మరుసటి రోజు సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష స్నేహితురాలికి చెప్పింది.
దీంతో ఆమెను జీజీహెచ్కు తీసుకెళ్లింది. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ ఘటనపై స్నేహితులు మృతురాలి కుటుంబసభ్యులకు, దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని దర్గామిట్ట ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, ఎస్సై విజయ్కుమార్లు పరిశీలించారు. మృతురాలు ఎడమ, కుడి చేతుల మీద ఇంజెక్షన్లు చేసుకున్న ఆనవాళ్లను గుర్తించారు. కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లై ఐదునెలలు పూర్తికాకుండానే నవ దంపతులు మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.