by సూర్య | Fri, Jan 08, 2021, 12:41 PM
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి.. ఓ గ్రామ వాలంటీర్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగడవరం గ్రామ సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న పొనుకుమాడుకు చెందిన గాలంకి శివకృష్ణపై గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన మువ్వా మోహన్ రావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తలపై నరకడంతో తీవ్రంగా గాయపడిన శివకృష్ణను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది.
ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. అయితే గతంలో మోహన్ రావు కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని శివకృష్ణ అధికారులకు చెప్పాడని, అప్పుడు వారిని ఏలూరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారని, దీనికి తోడు తన భార్యతో శివకృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలియడంతో మోహన్ రావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.