by సూర్య | Mon, Oct 19, 2020, 11:56 AM
తిరుమల కలిగయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో అభయమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
కేంద్రం మార్గదర్శకాలు, కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఈసారి ఏకాంతంగా బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం కానున్నాయి. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలన్నీ యథాతథంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం వాహనసేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. టీటీడీ ఐ అండ్ పీఆర్ మీడియాకు ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు, ఫొటోలు అందిస్తోంది.
Latest News