by సూర్య | Fri, Oct 16, 2020, 05:04 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ బిల్లును కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. తెలంగాణలో జరిగిన దిశా సామూహిక అత్యాచారం మరియు హత్య సంఘటన దేశవ్యాప్తంగా అందరిలో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన నేపధ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తగా దిశా బిల్లును తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు శాసనమండలి నుండి ఆమోదం పొందిన తరువాత, బిల్లును చట్టంగా మార్చడానికి కేంద్రానికి బిల్లు పంపింది.
అయితే దిశా బిల్లులో కొన్ని అవసరమైన సవరణలు చేయాలని, బిల్లును చట్టంగా మారాలంటే ఆ సవరణలు చేసి తిరిగి పంపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్రం దిశా బిల్లును వెనక్కు పంపింది. ఈ బిల్లుపై కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి, బిల్లులో మరికొన్ని మార్పులు చేయాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన దిశా చట్టం అమలులోకి రావాలంటే కేంద్రం ఆమోదంతోపాటు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాలి. తర్వాతే అధికారికంగా ఏపీలో దిశ చట్టం అమలులోకి వస్తుంది.
అయితే ఏపీలో దిశా చట్టం ఆధారంగా ఇప్పటికే పలు చోట్ల దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ చట్టం కింద కేసులు కూడా పెట్టగా.. ఇపుడు కేంద్రం దీన్ని వెనక్కు పంపడం గమనార్హం. ఈ దిశ చట్టం ప్రకారం మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోగా దోషులకు శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్రం ఈ చట్టాన్ని వెనక్కి పంపడం సంచలనంగా మారింది. మరి కేంద్రం సూచించిన సూచలను పాటించి మార్పులు చేసి మళ్లీ కేంద్రానికి దిశ బిల్లును పంపుతుందా లేదా అన్నది వేచి చూడాలి.