by సూర్య | Fri, Oct 16, 2020, 04:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన 139 కులాల సంక్షేమం కోసం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి చిత్తశుద్ధి చాటుకునేందుకు జగన్ సర్కార్ సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. ఇకపోతే బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలకు అక్టోబరు 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఒక్కో కార్పొరేషన్కు 13 మంది డైరెక్టర్లను నియమించి అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
బీసీ కార్పొరేషన్ల ద్వారా 728 మంది డైరెక్టర్లుగా పదవులు పొందనున్నారు. ఇందులో 50 శాతం పదవులు మహిళలకు దక్కనున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బీసీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు బీసీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించి జగన్ సరికొత్త అధ్యయానికి నాంది పలికారని బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.