by సూర్య | Fri, Oct 16, 2020, 02:49 PM
భారీ వర్షాల ధాటికి పంటలు పాడైపోయిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు పర్యటిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం, గుండిమెడలో దెబ్బతిన్న పసుపు, మినుము పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంట పొలాల రైతులకు అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ రైతులకు భరోసా ఇచ్చారని టీడీపీ ప్రకటించింది. ఆయనతో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఈ విషయంపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మంగళగిరి నియోజకవర్గంలోని గుండిమెడ, చిర్రావూరు, పెదకొండూరు గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించాను’ అని ఆయన చెబుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.