by సూర్య | Wed, Oct 14, 2020, 12:36 PM
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి చేరుకుంటోంది. వరద నీటి తాకిడితో లోతట్టు ప్రాంత ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయటంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని తెలిసి కూడా బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేయకుండా అధికారులు తాత్సారం చేశారని వరద ముంపు వాసులు ఆరోపిస్తున్నారు.
నిన్న సాయంత్రం వరకు కేవలం లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి, రాత్రికి రాత్రే ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్కి రావడంతో నిర్వాసితులు ఇబ్బందులమయమవుతున్నారు. పునరావాస కేంద్రాల్లో తమకెటువంటి సౌకర్యాల్లేవంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒకేఒక్క పునరావాస కేంద్రాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షం ధాటికి ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం బురదమయంగా కావడంతో బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతం. పునరావాస కేంద్రాల్లో ఉండలేక ఇళ్ల వద్దకే వెళ్లి రోడ్లపై పడిగాపులు పడుతున్నామని బాధితులు వాపోయారు. విజయవాడలోని తారకరామానగర్, భూపేష్ గుప్తా నగర్, బాలాజీనగర్లోకి వరద నీరు ప్రవేశంతో స్థానికులు ఇక్కట్లకు గురవుతున్నారు. తమను అధికారులు, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Latest News