by సూర్య | Mon, Oct 12, 2020, 12:38 PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కి.మీటర్లు, నర్సాపూర్కు తూర్పు ఆగ్నేయ దిశగా 360కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్-విశాఖపట్నం మధ్య కాకినాడకు సమీపంలో రేపు తెల్లవారుఝామున తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయుగుండం స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అజలడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కోరారు.
Latest News