by సూర్య | Fri, Oct 09, 2020, 07:13 PM
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై గత సంవత్సరం వేసిన రెండు పిటిషన్స్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున ఎన్నికలు షెడ్యూల్ ఇచ్చి వాయిదా వేశామని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందుకే ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని కోర్టుకు ప్రభుత్వం నిశితంగా వివరించింది. ఇందుకు స్పందించిన హైకోర్టు ఆ మాట చెప్పాల్సింది మీరు కాదని.. రాష్ట్ర ఎన్నికల సంగం చెప్పాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేరు..? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్-02 కు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. ఆగస్టు-06న ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసిన విషయం విదితమే. 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రత్యేకాధికారుల పాలన డిసెంబర్- 31 లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకూ పొడిగించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ 2021 జనవరి-02 వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు నోటిఫికేషన్లో పురపాలక శాఖ స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటంతో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ఆగస్టు-06న ఉత్వర్వుల్లో పురపాలక శాఖ స్పష్టం చేసింది.
Latest News