by సూర్య | Fri, Oct 09, 2020, 06:11 PM
ఏపీ ప్రభుత్వం ‘వైఎస్సాఆర్ జలకళ’ పథకాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఉచితంగా బోర్లు వేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా స్పష్టం చేసింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయమే తీసుకుంది. ఈ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను కూడా ఉచితంగానే అమర్చాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నాడు జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉచితంగానే విద్యుత్ కనెక్షన్ను కూడా అమర్చాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్ల లోతు, భూమి రకం, ఎంతమేర పంట సాగవుతోందన్న అంశాల ఆధారంగా పంపుసెట్లు, మోటార్లను బిగించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో పారదర్శకంగా పనులు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను కూడా సర్కార్ సిద్ధం చేసింది. రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి వివరాలను ఎస్ఎస్ఎంల ద్వారా పంపిస్తారు. ఈ వివరాలు ఆన్లైన్ కూడా తెలుసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకునే రైతుల భూమిలో అంతకు ముందు బోరు ఉండకూడదు. అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.
Latest News