by సూర్య | Thu, Oct 08, 2020, 05:27 PM
ఏపీకి మళ్లీ వానల ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అది వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని స్పష్టంచేశారు.
దీంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మరోవైపు అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలుల వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Latest News