by సూర్య | Thu, Oct 08, 2020, 04:16 PM
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ విద్యార్థుల కోసం జగనన్న విద్యాకానుకను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాది పాడు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించారు. మహాత్మా గాంధీ, డా.బిఆర్ అంబేద్కర్,సర్వేపల్లి రాధాకృష్ణ,వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నాడు నేడు కింద అభివృద్ధి చేసిన జడ్పీ పాఠశాల అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు లతో ముఖాముఖి సమావేశమయ్యారు. వాటర్ ప్లాంట్ పరిశీలించిన అనంతరం ఇంగ్లీష్ లాబ్, కొత్తగా ఏర్పాటు చేసిన బెంచిల నాణ్యత పరిశీలించారు. పాఠశాలలో ఆధునీకరించిన తరగతి గదులు పరిశీలించి వాటిలో ఏర్పాట్లు పై విద్యార్థులు నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
మధ్యాహ్నం భోజనం వంటశాలను తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల విలువైన జగనన్న విద్యా కానుక కిట్టులు ప్రభుత్వం అందజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్.. 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు ‘స్టూడెంట్ కిట్’ గా అందజేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వర్క్ బుక్స్ కూడా అందజేస్తోంది. వీటితో పాటు యూనిఫాం కుట్టుకూలీ డబ్బు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు.