by సూర్య | Wed, Oct 07, 2020, 03:10 PM
బహిరంగ ప్రదేశాల్లో నిరవధికంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, వాటి నిమిత్తమై బహిరంగ ప్రదేశాలను ఆక్రమించుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. నిరసనల పేరుతో బహిరంగ ప్రదేశాలను, ప్రజలు ఉపయోగించుకునే ప్రదేశాలను ఆక్రమించుకోవడం సరికాదని న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.
‘‘బహిరంగ ప్రదేశాలను నిరసనల నిమిత్తమై వాడుకోవడం, వాటిని నిరవధికంగా ఆక్రమించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. షహీన్బాగే కాదు.. ఎక్కడైనా ఇలా చేయడం సరికాదు. ఆ అడ్డంకులను తొలగించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. నిర్దేశించిన ప్రదేశాలలోనే నిరసన తెలియజేయాలి. ప్రజల రాకపోకలను సాగించే హక్కును నిరవధికంగా ఆపలేం. నిరసన తెలిపే హక్కు కచ్చితంగా ఉంటుంది. కానీ... కర్తవ్యాలను కూడా సమానంగా పాటించాలి. రోడ్లను వినియోగించుకునే హక్కు, నిరసన తెలిపే హక్కు తులనాత్మకంగా ఉండాలి.’’ సుప్రీంకోర్టు పేర్కొంది.
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ షహీన్బాగ్ ప్రాంతంలో నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నిరసనలతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందంటూ అమిత్ సాహ్ని అనే వ్యక్తి సుప్రీంలో పిల్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం పై విధంగా తీర్పునిచ్చింది.
Latest News