by సూర్య | Wed, Oct 07, 2020, 02:54 PM
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చే క్రమంలో ఆమె గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో ఆగి అక్కడి రైతులతో ముచ్చటించారు. స్థానిక రైతులను అడిగి వ్యవసాయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పంటలు, గిట్టుబాటు ధరలపై వారితో మాట్లాడారు. ధాన్యం, చెరకు పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యం కావడంలేదని రైతులు ఆమెకు తెలిపారు. వరికి ఒక క్వింటాకు రూ.2 వేలు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కరివేపాకు పంట ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించాలని తెలుపగా, కేంద్రం అందుకోసమే చట్టం తెచ్చిందని నిర్మలా వారికి వివరించారు.
కాగా, దీనిపై నిర్మలా సీతారామన్ కార్యాలయం ట్వీట్ చేసింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను స్వాగతిస్తున్నట్టు అక్కడి రైతులు నిర్మలాతో చెప్పారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తమ పంటలను ఇక ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న విషయాన్ని వారు గుర్తించారని తెలిపారు.
Latest News